
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీలో రెండు లేదా మూడు ఫామ్ పాండ్లు (Farm Ponds) నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. దాన కిషోర్ అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 15లోగా ప్రతి మండలంలో కనీసం 25 ఫామ్ పాండ్లు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామాల్లో భూములు కలిగిన మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములుగా తీసుకుని ఫామ్ పాండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.
ఈ పనులను క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేసేందుకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారులు (జడ్పీ సీఈవోలు), జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓలు), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్డీఓలు) అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బుధవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పెషల్ సీఎస్ ఎం. దాన కిషోర్ ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు.
