Headlinesపంచాయితీల్లో కరెంట్ బిల్లుల పంచాయితీ

పంచాయితీల్లో కరెంట్ బిల్లుల పంచాయితీ

Link Copied!

గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.1,700 కోట్లకు చేరినట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది.

బకాయిలు చెల్లించాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఒత్తిడి

అలా ఎలా చెల్లిస్తారంటూ కార్యదర్శులను అడ్డుకుంటున్న సర్పంచులు

 

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఒకవైపు పేరుకుపోయిన బకాయిలు, చెల్లించాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఒత్తిడి తెస్తుండగా, మరోవైపు కేంద్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ బిల్లులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన ఆదేశాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,700 గ్రామాలు గ్రామ పంచాయతీలు ఉండగా, విద్యుత్ శాఖకు సుమారు రూ. 1700 కోట్ల బకాయిలు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ గుర్తించింది.

ఈ బకాయిలు దాదాపు రెండున్నరేళ్ళుగా పెండింగ్‌లో ఉన్నాయి.పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో, వాటిపై పర్యవేక్షణ కొరవడడంతో, కరెంట్ బిల్లులపై ఎవరు దృష్టి సారించలేదు. దీంతో క్రమంగా పంచాయతీల్లో కరెంట్ బిల్లు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. గ్రామాల్లో, పల్లె ప్రగతిలో భాగంగా, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, మిషీన్ భగీరథ, పంపింగ్‌లతో పాటు వీధి దీపాల నిర్వహణ కోసం విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో పంచాయతీలకు కరెంట్ బిల్లులు భారంగా వస్తున్నాయని వినియోగం పెరిగిన దానికి తగినట్టుగా పంచాయతీలకు నిధులు రాకపోవడంతో ఏళ్లుగా బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.

కార్యదర్శులను అడ్డుకుంటున్న సర్పంచులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీల్లో ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలను డిజిటల్ కీస్ ఉపయోగించి చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శులు ప్రయత్నిస్తుండగా, సర్పంచులు స్థానిక ప్రజా ప్రతినిధుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలను ఆర్థిక సంఘం నిధుల నుంచి ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం, స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస సేవలకుఈ విధులను వినియోగించుకోవచ్చని పంచాయతీ ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ వినియోగం కూడా కనీస సేవల పరిధిలోకి వస్తుందని నిబంధనల ప్రకారమే బకాయిలు చెల్లించాలని ఆదేశించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద కరెంట్ బిల్లులు కట్టవచ్చని పేర్కొంటున్నారు.

పంచాయతీ అవసరాలకే కరెంట్ వినియోగించారు కాబట్టి బిల్లుల చెల్లింపును ఎవరు అడ్డుకోకూడదని కోరుతున్నారు.పాత బకాయిలను అప్పటి ప్రత్యేక నిధుల ద్వారా కానీ, ప్రత్యేక గ్రాంట్ల ద్వారా కానీ క్లియర్ చేయాలి. అలా కాకుండా ప్రస్తుతం గ్రామాల్లో మౌలిక వసతుల కోసం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను పాత విద్యుత్ బిల్లులకు మళ్లిస్తే గ్రామాల్లో మురుగు నీటి కాలువల నిర్వహణ, రోడ్లు పారిశుద్య పనులు, తాగునీటి పైపుల లీకేజీల మరమత్తులు వంటి అత్యవసర సేవలు అత్యవసర పనులకు పైసలు ఎక్కడి నుండి తేవాలని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

పలు జిల్లాల్లో కార్యదర్శులను నిధులు డ్రా చేసి చేయకుండా స్థానిక ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నట్టు సమాచారం.మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.30 కోట్ల వరకు పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించినట్టు తెలిసింది.వీలైనంత త్వరగా బకాయిలు చెల్లించేలా చూడాలని డిపిఓఆర్ లకు, పిఆర్ ఉన్నతాధికారులు ఆదేశించడంతో వారు కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తే పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇస్తామని మౌఖికంగా చెబుతున్నారని కార్యదర్శులు వాపోతున్నారు.

తాజా వార్తలు

Related Articles